భక్తి భావం విరాజిల్లేలా, ప్రకృతి అందాలు ద్విగుణికృతమయ్యేలా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, ఆహ్లాదపరిచేలా యాదగిరిగుట్ట ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికే వన్నె తెచ్చే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయంతో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాలను చక్కగా తీర్చిదిద్దడం కోసం తయారయిన డిజైన్లను ముఖ్యమంత్రి కేసిఆర్ సోమవారం క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. ఆలయ స్థపతి ఆనంద్సాయి, ఆర్కిటెక్టులు రాజు, జగన్ తదితరులు రూపొందించిన డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రధాన గుట్టపై దాదాపు ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ప్రధాన దేవాలయ ప్రాంగణం, నాలుగు మాడ వీదులు, నాలుగు రాజ గోపురాలు, కాలి నడక మార్గం, భక్తుల క్యూకాంప్లెక్సు, బ్రహోత్సవాలు జరిగే ప్రాంతం, ఈశాన్యంలో వచ్చే పుష్కరిణి విస్తరణ, తూర్పున ఉండే శివాలయం, ఆంజనేయస్వామి విగ్రహం, పశ్చిమాన ఉండే ప్రధాన ప్రవేశ ద్వారం తదితర నిర్మాణ డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలోనే నాలుగు వైపుల పాకశాల, అద్దాల మండపం, కళ్యాణ మంటపం, యాగశాల నిర్మాణాలకు కూడా డిజైన్లు తయారయ్యాయి.
గతంలో నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో, యాదగిరిగుట్టను సందర్శించినప్పుడు పరిశీలించిన సమయంలో ముఖ్యమంత్రి కేసిఆర్ చేసిన సూచనలకు అనుగుణంగా డిజైన్లు రూపొందించినట్లు ఆలయ శిల్పులు చెప్పారు. యాదగిరిగుట్ట ప్రధాన ఆలయంతో పాటు చుట్టు ప్రక్కల ఉన్న కొండలు, గుట్టలు, ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడెక్కడ ఏ నిర్మాణాలు రావాలన్న విషయంలో కూడా సోమవారం నాటి సమీక్షలో స్పష్టత వచ్చింది. ప్రధాన ఆలయంలో భాగంగానే పుష్కరిణి, కళ్యాణ కట్ట, దేవాలయానికి అభిముఖంగా దేవుడి వస్తువులు లభించే షాపులు, మండల దీక్షలు చేసే వారి కోసం వసతి, భక్తులు బస చేయడానికి వీలుగా కాంప్లెక్సులు నిర్మించాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రస్తుతం గుహలో కొలువైన లక్ష్మీనరసింహస్వామి మూల విరాట్ యథావిధంగా ఉండాలని, మిగిలిన ప్రాంతమంతా ఆగమ శాస్త్ర నియమాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆలయం పవిత్రత దృష్ట్యా ప్రధాన ఆలయం చుట్టూ మాడ విధులు ఉండాలన్నారు. గుట్టపై ఏక కాలంలో 30 వేల మంది భక్తులు కలియ తిరిగినా ఇబ్బంది కలగని విధంగా నిర్మాణాలు ఉండాలన్నారు. భక్తులు సేద తీరడానికి వీలుగా గుట్ట ప్రాంతాన్ని ప్రకృతి రమణీయత ఉట్టి పడే విధంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రధాన గుట్ట చుట్టూ ఉన్న ఇతర గుట్టలను కూడా చక్కగా తయారు చేయాలన్నారు. అతిథి గృహాలు, కాటేజీలు, అందమైన ఉద్యాన వనాలు, విశాలమైన రోడ్లు, గుట్టపైకి వచ్చి వెల్లడానికి వేరు వేరు దారులు ఉండాలన్నారు.
గుట్ట క్రింది భాగంలో 2500 మంది పట్టే విధంగా మంచి కళ్యాణ మంటపం నిర్మించాలన్నారు. యాదగిరిగుట్ట సమీపంలోని బస్వాపూర్ చెరువును పెద్ద రిజర్వాయర్గా మారుస్తున్నామన్నారు. రిజర్వాయర్కు అనుబంధంగా మైసూర్ బృందావన్ గార్డెన్ తరహాలో థీమ్ పార్క్ నిర్మించాలన్నారు. మొత్తం యాదగిరిగుట్ట ప్రాంతమంతా భక్తి పారవశ్యం నిండాలని, కుటుంబ సభ్యులతో సహా వచ్చే వారు ఆనందంగా, ఆహ్లాదంగా గడిపే వాతావరణం సృష్టించాలన్నారు. యాదగిరిగుట్ట ప్రాంతమంతా సెంట్రలైజ్డ్ మైక్ సిస్టం ఏర్పాటు చేయాలని, నిత్యం స్తోత్రాలు వినిపించాలని సిఎం చెప్పారు. భక్తులకు సరిపడే విధంగా మంచినీటి సరఫరా ఉండాలని, మెరుగైన మురుగునీటి నిర్వహణ ఉండాలన్నారు. యాదగిరిగుట్ట డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్, సిఇఒ జె.కిషన్రావు, సిఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్రెడ్డి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.












































